హరీశ్ రావు అబద్ధాలతో సీఎంను బదనాం చేస్తున్నారు: జగ్గారెడ్డి

  • కాళేశ్వరం ప్రాజెక్టుపై హరీశ్ రావు అవాస్తవాలు మాట్లాడుతున్నారన్న జగ్గారెడ్డి
  • బ్యారేజీల్లో నీటిని నిల్వ చేయవద్దని చెప్పింది కేంద్ర సంస్థ NDSA అని వెల్లడి
  • నాసిరకం నిర్మాణం వల్లే హరీశ్‌ను కేసీఆర్ మంత్రి పదవి నుంచి తీసేశారని విమర్శ
  • మంత్రి పదవి కావాలంటే హరీశ్ రావు కాంగ్రెస్‌లో చేరవచ్చని ఎద్దేవా
కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో బీఆర్ఎస్ నేత హరీశ్ రావు అవాస్తవ ప్రచారం చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిల ప్రతిష్టకు భంగం కలిగించేందుకు ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ నేత టి. జగ్గారెడ్డి ధ్వజమెత్తారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ హరీశ్ రావుపై తీవ్ర విమర్శలు గుప్పించారు.

మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో నీటిని నిల్వ చేయకూడదనే నిర్ణయం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నది కాదని, అది కేంద్ర ప్రభుత్వ పరిధిలోని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (NDSA) ఇచ్చిన ఆదేశమని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. ఆ బ్యారేజీల్లో నీటిని నింపితే అవి కూలిపోయే అవకాశం ఉందని, ఫలితంగా ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉందని NDSA హెచ్చరించిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు.

గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఈ ప్రాజెక్టును అత్యంత నాసిరకంగా నిర్మించారని, ఆ సమయంలో నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న హరీశ్ రావు వైఫల్యం వల్లే అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన్ను పదవి నుంచి తప్పించారని జగ్గారెడ్డి ఆరోపించారు. ప్రస్తుత ప్రభుత్వంపై విమర్శలు సంధించే ముందు, ప్రాజెక్టులో దొర్లిన లోపాలపై హరీశ్ రావు ప్రజలకు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

మూడు నెలల పాటు నీటిపారుదల శాఖను తనకు అప్పగించాలంటూ హరీశ్ రావు విసిరిన సవాల్‌పై జగ్గారెడ్డి వ్యంగ్యంగా స్పందించారు. మంత్రి పదవి కావాలనుకుంటే హరీశ్ రావు రాజ్యాంగ నిబంధనల ప్రకారం కాంగ్రెస్ పార్టీలో చేరవచ్చని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే కోరిన విధంగా, కాళేశ్వరం ప్రాజెక్టుపై చర్చించేందుకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీకి రావాలని ఆయన పిలుపునిచ్చారు.                                

Jagga Reddy
Harish Rao
Kaleshwaram Project
Revanth Reddy
Medigadda Barrage
Telangana Politics

More Telugu News